న్యూఢిల్లీ, మార్చి 26 : ఇరాన్ ఎలైట్ నేవల్ ఫోర్స్ కమాండర్ అలీరేజా తంగ్సీరీ దక్షిణ ఇరాన్లో జరిగిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగవ వారం కొనసాగుతున్న సమయంలో ఇరాన్కు చెందిన మరో అత్యున్నత అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ)లో భాగమైన నౌకాదళానికి సారథ్యం వహిస్తున్న తంగ్సీరీ బంద్ అబ్బాస్లో జరిగిన వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి తెలిపారు.
హొర్ముజ్ జలసంధి మూసివేతను పర్యవేక్షించే బాధ్యతను కమాండర్ తంగ్సీరీ నిర్వహిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. అయితే ఈ వార్తను ఇరాన్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇజ్రాయెలీ రక్షణ దళాలు కూడా దాడిపై స్పందించలేదు. ఈ వార్తలను ఇరాన్ ధృవీకరిస్తే అది ఆ దేశ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్లోని దాని నావికా కార్యకలాపాలకు గట్టి దెబ్బ అవుతుంది.