బార్సిలోనా (స్పెయిన్), మే 22: ఇంతకాలం ఇజ్రాయెల్తో సఖ్యతగా వ్యవహరించిన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ తమ వైఖరిని మార్చుకున్నాయి. ‘స్వతంత్ర పాలస్తీనా’ను తాము గుర్తిస్తున్నట్టు అవి బుధవారం ప్రకటించాయి. ఈ నెలలో ఉత్తర, దక్షిణ గాజా స్ట్రిప్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరపడం, దాని కారణంగా వేలాది మంది కొత్తగా వలసలు పోవడం, ఆ దేశానికి అందే సహాయాన్ని అడ్డుకోవడం, అక్కడ కరవు పరిస్థితులు అధికం కావడం తదితర కారణాలతో ఈ మూడు దేశాలు స్వతంత్ర పాలస్తీనాకు మద్దతు ప్రకటించాయి. ఈ ప్రకటన ఇజ్రాయెల్కు ఖేదాన్ని మిగల్చగా, పాలస్తీనా మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్యతో కినుక వహించిన ఇజ్రాయెల్ నార్వే, ఐర్లాండ్ దేశాలలో ఉన్న తమ దేశ దౌత్యవేత్తలను వెనక్కి రమ్మని ఆదేశించింది.