Israel-Hamas War | గాజా సిటీ/జెరూసలేం, అక్టోబర్ 18: గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నది. దాదాపు 500 మంది మరణించిన ఈ దాడి ఘటనలో తమ పాత్ర ఏమాత్రం లేదని ఇజ్రాయెల్ బెంజిమెన్ నేతన్యాహూ ప్రభుత్వం చెప్పుకొస్తున్నది.
ఇదే సమయంలో గాజాలోని పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ మిస్ ఫైర్ అయిన కారణంగా ఈ ఘటన జరిగిందని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొన్నది. ఈ మేరకు తమ వాదనను సమర్థించుకొనేందుకు పేలుడుకు సంబంధించిన వీడియోలను బుధవారం విడుదల చేసింది. ఈ ఘటనలో రాకెట్ భవనంపై పడిన తర్వాత మంటలు రేగాయని, అయితే తమ రాకెట్లతో తీవ్ర ప్రభావం ఉంటుందని, పెద్ద గోయ్యి కూడా ఏర్పడుతుందని, అయితే అక్కడ అలా జరుగలేదని పేర్కొన్నది. మరోవైపు గాజా దవాఖానపై దాడి ఘటనలో ఇజ్రాయెల్పై హమాస్ చేస్తున్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేయలేదని, అది మిలిటెంట్ల పనేనని, ఈ మేరకు తమ రక్షణ విభాగం నుంచి డాటా వచ్చిందని పేర్కొన్నారు.
ఈజిప్టు గుండా గాజాలోని పౌరులకు మానవతా సాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపిందని బైడెన్ వెల్లడించారు. గాజా, వెస్టుబ్యాంకుకు అమెరికా తరఫున 100 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ దాడులు, పౌరులపై హింసను ఖండిస్తూ, గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని కోరు తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. 15 మంది సభ్యదేశాల్లో 12 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, అమెరికా వ్యతిరేకించింది. మరో రెండు దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. కాగా, 10 మంది హమాస్ నేతలతోపాటు ఆ గ్రూపు ఆర్థిక నెట్వర్క్పై అమెరికా బుధవారం ఆంక్షలు విధించింది.