Israel- Hamas War | సియోల్/జెరూసలేం, అక్టోబర్ 19: ఇజ్రాయెల్పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు, రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకొన్న ఆయుధాలను దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు, అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషించింది. దాడుల్లో భాగంగా హమాస్ ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్లను వినియోగించినట్టు ఈ విశ్లేషణ పేర్కొన్నది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్కు ఉత్తరకొరియా దీర్ఘకాలంగా మద్దతు తెలుపుతున్నదని ఆయుధ నిపుణుడు జెంజన్ జోన్స్ తెలిపారు. అయితే తాము హమాస్కు ఆయుధాలు సరఫరా చేయలేదని ఉత్తర కొరియా తాజా వార్తలను ఖండించింది.
మరోవైపు ఈనెల 7న దాడి తర్వాత గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 203 మంది కుటుంబాలకు వివరాలు తెలియజేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. అయితే మొత్తం బందీల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ దాడిలో 306 మంది జవాన్లు మరణించారని ఆయన తెలిపారు. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్లు సహా 6 వేల మందికి పైగా మరణించారు.
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో తమ దేశం ఇజ్రాయెల్కు అండగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఇజ్రాయెల్లో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. గాజాలోని మానవతా కారిడార్ను తెరువడాన్ని సునాక్ స్వాగతించారు.
గాజాలోని దవాఖానపై జరిగిన దాడిపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పిలుపునిచ్చారు. సాధారణ పౌరుల మరణాలు, మానవతా సంక్షోభ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నదని పేర్కొన్నారు. గాజాలో గతంలో నలుగురు భారతీయులు ఉండే వారని, ప్రసుత్తం ఆ సంఖ్యపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం గాజా నుంచి పౌరులను తరలించే పరిస్థితి లేదని, అవకాశం దొరికినప్పుడు వారిని బయటకు తీసుకొస్తామని అరిందమ్ బాగ్చి చెప్పారు.
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నది. అన్ని ప్రాంతాలపై బాంబులు వేస్తున్నది. ఉత్తర గాజాలోని ప్రజలు దక్షిణాదికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ, దక్షిణ గాజా ప్రాంతాలను సురక్షిత జోన్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే ఉత్తర గాజాతో పాటు దక్షిణ ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. దక్షిణ రీజియన్లోని ఖాన్ యూనిస్ పట్టణంలో వేలాది మంది ఆశ్రయం పొందుతున్న ఓ భవనంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించగా, దాదాపు 50 మందికి గాయాలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాలస్తీనియన్లు తమకు ఎక్కడా భద్రతా లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు.