Israel-Hamas Conflict | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మరో కమాండర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. వైమానిక దాడిలో కమాండ్ బిలాల్ అల్ కేద్రా మృతి చెందగా.. అతను నుఖ్బా దళానికి కమాండర్గా పని చేస్తున్నాడు. నుఖ్బా ఫోర్స్ అనేది హమాస్ నౌకాదళానికి చెందిన ప్రత్యేక దళాల విభాగం. దక్షిణ గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో బిలాల్ అల్ కేద్రా ఉన్నట్లుగా తమ నిఘా వర్గాలకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. తర్వాత దాడి జరుపగా.. బిలాల్ అల్ కేద్రా మరణించినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటనలో పేర్కొంది. దాడిలో హమాస్ ఉగ్రవాదులు సైతం మరణించినట్లు తెలిపింది.
దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్, జైతున్, జబాలియా వెస్ట్ ప్రాంతాల్లోని వందకంటే ఎక్కువ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. హమాస్ కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ట్యాంకులతో పాటు హమాస్ క్షిపణి దాడుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. గతంలో ఇజ్రాయెల్లో జరిగిన రక్తపాతానికి కారణం కిబ్బట్జ్ నిరిమ్లో హింస వెనుక బిలాల్ అల్-కెద్రా హస్తం ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. హమాస్ వైమానిక దళ చీఫ్ మురాద్ అబు మురాద్, ఇజ్రాయెల్ వైమానిక దళం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం అల్టిమేటం ఇచ్చింది.