టెల్ అవీవ్ : కరోనా వైరస్ తాజా కేసులు, తీవ్ర లక్షణాలతో కూడిన కేసులు గణనీయంగా తగ్గడంతో ఇజ్రాయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయిల్ మరో అడుగు ముందుకేసి కొవిడ్-19 కట్టడికి విధించిన నియంత్రణలను పూర్తిగా ఎత్తివేసింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారితో పాటు వ్యాక్సినేషన్ జరగని వారిని కూడా అనుమతించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
అడ్మిషన్లకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధనను కూడా సడలించినట్టు పేర్కొంది. ఈవెంట్లు, షాపులు, రెస్టారెంట్లలో ప్రజలను అనుమతించే సంఖ్యపై పరిమితులు కూడా రద్దయ్యాయి. అయితే ఇండోర్లలో మాస్క్ ధరించాలనే నిబంధన మరికొంత కాలం కొనసాగుతుందని తెలిపింది. ఇజ్రాయిల్ లోకి అడుగుపెట్టేందుకు విధించిన నిర్ధిష్ట నిబంధనలు కూడా అమల్లో ఉంటాయని వెల్లడించింది.
కరోనా కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టడంతో ఇజ్రాయిల్ లో కరోనా కేసులు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదివారం దేశవ్యాప్తంగా కేవలం నాలుగు తాజా పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం పురోగతికి అనుగుణంగా కరోనా వైరస్ నియంత్రణలను ప్రభుత్వం దశల వారీగా సడలించింది.