Israel airstrikes : హెజ్బొల్లా (Hezbollah) ను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ (Israel) దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజా (Gaza) లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతులంతా పురుషులేనని వెల్లడించారు.
డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదులో నిరాశ్రయులైన జనం ఉంటున్నారు. ఆదివారం ఉదయం మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఉత్తర లెబనాన్లోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ అధికారి, అతడి కుటుంబసభ్యులు మరణించారని హమాస్ శనివారం వెల్లడించింది. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో సంగీత కార్యక్రమంపై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక్క గాజాలోనే దాదాపు 42 వేల మంది మరణించారు.
యుద్ధం ప్రారంభం నుంచి హమాస్కు ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. కానీ ఇటీవల హెజ్బొల్లా కీలక నేతలను హతమార్చడంతోపాటు తమ భూభాగంలో కొంత మంది నేతలను ఇజ్రాయెల్ చంపడంతో స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దాంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 200 క్షిపణులతో తమపై దాడి చేసిన ఇరాన్పై భీకరస్థాయిలో విరుచుకుపడతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.