జెరూసలెం : గాజాలో హమాస్ (Israel-Hamas War) స్ధావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్ ముమ్మరం చేయడంతో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ దళాల దాడుల్లో హమాస్ ఆయుధాల తయారీ విభాగాధిపతి ముహ్సిన్ అబు జినాను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ భద్రతా దళాలు (ఐడీఎఫ్) వెల్లడించాయి. వ్యూహాత్మక ఆయుధాలు, రాకెట్ల తయారీలో జినా సిద్ధహస్తుడని ఐడీఎఫ్ తెలిపింది.
మరోవైపు హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం పురోగమిస్తోందని హమాస్ను రూపుమాపే దిశగా సాగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ చెరలో ఉన్న వారందరినీ విడిపించేంతవరకూ ఎలాంటి సంధి ప్రయత్నాల ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాగా, గాజాలోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
గాజా చిన్నారులకు శ్మశాన వాటికలా మారుతోందన్నారు. గాజా పరిస్థితి మానవతా సంక్షోభం కంటే ఎక్కువ అని.. ఇది మానవత్వం సంక్షోభమన్నారు.కాల్పుల విరమణ అవసరమని.. ప్రతి గంటకు మరింత అత్యవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం గాజాలో అమానవీయ ఘటనలను ఆపాలని, అలాగే మానవతా సహాయాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
Read More :
రైల్వే అధికారుల నిర్లక్ష్యం : శవంతోనే 600 కిలోమీటర్లు ప్రయాణించిన పాసింజర్లు