న్యూయార్క్ : భారత్లో పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వెళ్లగా అక్కడ సీనియర్ అధికారులు లైంగిక వేధింపులకు గురిచేశారని మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ స్పందించింది. తమ దౌత్య కార్యాలయాలను సందర్శించే వారి పట్ల అమర్యాదరకరంగా, అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేందిలేదని స్పష్టం చేసింది. వీసా, కాన్సులర్ దరఖాస్తుదారుల పట్ల సభ్యతగా వ్యవహరించాలని, ప్రొఫెషనల్గా తమ విధులు నిర్వహించాలని దౌత్య సిబ్బందికి విస్పష్ట సూచనలు చేవామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్ర బలోచ్ పేర్కొన్నారు.
ప్రజల అభ్యంతరాలు, వినతుల పరిష్కారానికి పటిష్టమైన వ్యవస్ధలు ఉన్నాయని, తమ మిషన్స్ను సందర్శించే వ్యక్తుల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2021లో పాకిస్తాన్ను సందర్శించేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేందుకు తాను పాక్ ఎంబసీని సందర్శించిన సమయంలో అక్కడి సీనియర్ అధికారులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అప్పటి ఘటనను గురించి ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
తాను పాకిస్తాన్ హై కమిషన్తో ఆన్లైన్ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నానని ఆమె చెప్పారు. లాహోర్లోని ఓ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాల్సిఉందని, అక్కడి కట్టడాల గురించి రాయదలుచుకున్నానని ఎంబసీ అధికారులకు తెలిపానని గుర్తుచేసుకున్నారు. తాను అక్కడనుంచి వెళుతుండగా మరో అధికారి అక్కడికి వచ్చి తనను వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారని చెప్పారు. మీరు ఎందుకు పెండ్లి చేసుకోలేదని తనను ప్రశ్నించాడని, పెండ్లి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారని, లైంగిక వాంఛలు ఎలా తీర్చుకుంటారని అనుచితంగా ప్రశ్నించాడని తెలిపారు. వేరే టాపిక్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తన ప్రశ్నలతో వేధించాడని పంజాబ్ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్కూ ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ పోర్టల్లోనూ గతంలో ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు పాక్ విదేశాంగ మంత్రి బులావల్ భుట్టోకి లేఖ రాశారు.