న్యూయార్క్ : విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలోనోవా అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంతానికి కారణమవుతుందని తేల్చారు. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొట్టుకోవడం లేదా న్యూట్రాన్ స్టార్ బ్లాక్హోల్లో కలిసిపోవడాన్ని కిలోనోవా అంటారు. భూమినుంచి 36 కాంతి సంవత్సరాల దూరంలో గనుక ఈ కిలోనోవా దృగ్విషయం సంభవిస్తే గామా, ఎక్స్, కాస్మిక్ కిరణాలు ప్రాణాంతకమైన రేడియేషన్ను విడుదల చేస్తాయని, దీనివల్ల భూమిపై ఉన్న జీవరాశి తుడుచుకుపెట్టుకుపోతుందని పరిశోధకులు గుర్తించారు. అయితే, భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదమేమీ లేదని, కిలోనోవాలాంటి దృగ్విషయాలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు.