Esmail Khatib : అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో వరుసగా అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. మంగళవారం రాత్రి టెహ్రాన్లో జరిపిన కాల్పుల్లో ఖతిబ్ మరణించినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.
ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢచర్యంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ దాడుల్లో ఖతిబ్ కీలక పాత్ర పోషించాడు. అణచివేత, తీవ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. మహ్సా అమిని మృతి సందర్భంగా ఇరాన్లో జరిగిన నిరసనల సందర్భంగా ఖతిబ్ తీవ్ర అణచివేతకు పాల్పడ్డట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఖతిబ్.. అయతొల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, సైన్యం టాప్ కమాండర్ గులాం రెజా సాల్మనీ మరణించిన మరుసటి రోజే ఖతిబ్ హతమవ్వడం ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బే. మరోవైపు ఇరాన్ కీలక నేతల్ని హతమారుస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ ఖట్జ్ తెలిపారు. ఈ విషయంలో సైన్యానికి ప్రధాని నెతన్యాహు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే ఇరాన్ అగ్ర నేతల్ని చంపేందుకు ఆదేశించారని చెప్పారు. మరోవైపు దక్షిణ లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఒక బిల్డింగ్పై జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యానికి, హెజ్బుల్లా తీవ్రవాదులకు మధ్య జరిగిన దాడుల సందర్భంగా లెబనాన్పై దాడి జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. ఒకవైపు తమ దేశ కీలక నేతలు హతమవుతున్నా ఇరాన్ మాత్రం ఎదురుదాడులు ఆపడం లేదు. దుబాయ్ సహా పలు గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్లపై ఇరాన్ దాడి చేస్తూనే ఉంది.