Israel-Iran | టెహ్రాన్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి ఎంతో సమయం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ఇరాన్ ఆదివారంలోగా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తున్నదని అమెరికా, ఇతర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవడంతోపాటు పశ్చిమాసియాలోని తమ బలగాలను కాపాడుకొనేందుకు అమెరికా రెండు విధ్వంసక యుద్ధ నౌకలు, ఇతర సామగ్రిని తూర్పు మధ్యదరా సముద్రానికి తరలించింది.
దాడి ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఇజ్రాయెల్ సంస్థకు చెందిన ‘ఎంసీఎస్ ఏరీస్’ అనే కార్గో నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ శనివారం యూఏఈ తీరం సమీపంలో స్వాధీనం చేసుకొని, ఇరాన్ జలాల వైపు మళ్లించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాగా, ఈ నౌకలోని 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారిని విడిపించేందుకు ఇరాన్ అధికారులతో భారత్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తాజా ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. పశ్చిమాసియాలో ఘర్షణలను ఎగదోసేలా చర్యలకు పాల్పడుతున్న ఇరాన్ ‘తీవ్ర పరిణామాలు’ ఎదుర్కోవాల్సి ఉంటుందని, తగిన మూల్యం చెల్లించుకొంటుందని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి వార్తల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా సంస్థలు ఇరాన్ గగనతలం వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి.