(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో భారీయెత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన తొలిరోజు ఇరాన్లోని మినాబ్లో ఉన్న ఓ ఎలిమెంటరీ పాఠశాలపై బాంబు దాడులు జరిగి 150 మంది చిన్నారులు మరణించడం యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే, తాము ఈ దాడులు జరుపలేదని, కచ్చితత్వం లేని ఇరాన్ క్షిపణులే ఈ ప్రమాదానికి కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇరాన్లోని ప్రముఖ పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ ప్రచురించిన ఫస్ట్ పేజీ సంచలనంగా మారింది. మినాబ్ స్కూల్ దాడిలో మరణించిన చిన్నారుల ఫొటోలను మొదటి పేజీలో టెహ్రాన్ టైమ్స్’ పబ్లిష్ చేసింది. ఈ మేరకు ఆ కాపీని ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘ట్రంప్ ఒక్కసారి ఈ చిన్నారుల కండ్లల్లోకి చూడు’ అంటూ ప్రధాన శీర్షికగా పెడుతూ.. ‘వందలాది మంది ఇరాన్ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మినాబ్ దాడిని అంగీకరించడం లేదంటూ’ మండిపడింది. టెహ్రాన్ టైమ్స్ పోస్ట్పై సోషల్మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. దేశాల మధ్య గొడవలతో పసిమొగ్గలు ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.