Dubai airport : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్పై వరుసగా దాడులు చేస్తోంది. తాజాగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు సహా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయంపై దుబాయ్ అధికారులు ప్రకటన చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో ఒక భారతీయుడు, ఒక బంగ్లాదేశీ, ఇద్దరు ఘనా పౌరులు గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఒకపక్క ఇరాన్ దాడులు జరుగుతున్నప్పటికీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా క్షేమంగానే ఉన్నాడని ఆ దేశం ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దీన్ని నమ్మడం లేదు. అతడు స్వల్పంగా గాయపడి ఉంటాడని భావిస్తోంది. తమ దేశం కాల్పుల విరమణ కోరుకోవడం లేదని, తమపై దాడులు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే అని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ జరుపుతున్న మిస్సైల్ దాడుల్ని తమ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంటోందని యూఏఈ అధికారులు అంటున్నారు. బుధవారం పలు ఇరాన్ మిస్సైల్స్ను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న మిస్సైల్ దాడుల్ని తాము అడ్డుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన అధునాతన హెర్మెస్ 900 మిస్సైల్స్, హెరాన్ టీపీ మిస్సైల్స్ను ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ గగనతలంలోనే అడ్డుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి అలాగే మూసి ఉంటే ప్రపంచ సంక్షోభం తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. చమురు సరఫరా లేకపోవడం వల్ల ఆహార పదార్థాల ధరలు, జీవన వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో ఇరాన్ పౌరులు 1,300 మందికిపైగా మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది.