టెహ్రాన్: దశాబ్దాల పగ భగ్గుమంది. ఇరాన్, ఇజ్రాయెల్ (Israel Iran War) దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్కు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది. టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నది. 78 మంది చనిపోయారని, వారిలో అత్యధికులు సాధారణ పౌరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు. మరో 320 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. అయితే తమ ఇరాన్కు చెందిన ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్లు, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
కాగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. దీంతో రెండు నగరాల్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, సుమారు 34 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని డజన్లకొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.
ఈ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. శుక్రవారం తెల్లవారుజాము నాటి దాడుల తర్వాత 24 గంట్లలోపే మరోసారి క్షిపణులతో దాడిచేసింది. రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అణు, మిలిటరీ స్థావరాలతో సహా 200 లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఇస్ఫహాన్ అణుకేంద్రపై దాడిచేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఎయిర్ఫోర్స్ ఫైటర్ జెట్లతో లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపింది. ఫోర్డూ అణుకేంద్రం సమీపంలో కూడా పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.