Iran warning : ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని (Ali Larijani) హెచ్చరించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన.. తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు.
తాము ట్రంప్ను వదిలిపెట్టమని, ఖమేనీ మృతికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లారిజాని పేర్కొన్నారు. దాడుల్లో తమ నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది సాధారణ విషయం కాదని, దీనికి తగిన రీతిలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ యుద్ధంలో తాము అనేక మంది అమెరికన్ సైనికులను బంధించామని అలీ లారిజాని మరో పోస్టులో పేర్కొన్నారు.
బంధీలను జైళ్లలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్ దాడుల్లో కేవలం ఆరుగురు యూఎస్ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నిజానికి చాలామంది చనిపోయారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మృతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులపై లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని యూఎస్ బలగాలు బంధీగా తీసుకెళ్లిన విషయాన్ని లారిజాని ప్రస్తావించారు. వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని, కానీ అది విఫలమైందని అన్నారు. అయితే యూఎస్ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమని సెంటాకామ్ ప్రతినిధి మీడియాతో అన్నారు.