టెహ్రాన్: ఇరాన్లోని కీలకమైన ఖర్గ్ దీవిలో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు అమెరికా ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ దీవిలో ఉన్న మిలిటరీ కేంద్రాలను ధ్వంసం చేసిన అమెరికా .. అవసరమైతే త్వరలో ఆ దీవిలో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖటిబ్జాదే వార్నింగ్(Iran Warning) ఇచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒకవేళ అమెరికా బలగాలు ఇరాన్లో కాలుమోపితే, అప్పుడు వాళ్లు మరో వియత్నం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. టెహ్రాన్లోని తన ఆఫీసు నుంచి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో వీలైనన్ని రోజులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం వెతకడం లేదన్నారు. ఇరాన్ ఆపరేషన్ గురించి ట్రంప్ కామెంట్ చేసిన అంశంపై ప్రశ్న వేయగా.. ఓసారి వియత్నాంలో ఏం జరిగిందో చదువుకోవాలని మంత్రి కటిబ్జాదే అన్నారు. ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. పబ్లిక్గా కనిపించకపోయినా ఆయన ఇంచార్జీ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు.
మరో వైపు ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసింది. వెస్ట్ జెరుసలాంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిన్ నెతన్యహూ ఆఫీసుకు కొన్ని మీటర్ల దూరంలో క్షిపణి పడినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఎస్ఎన్ఎన్ పేర్కొన్నది. అయితే ఐడీఎఫ్ కూడా ఈ క్షిపణి గురించి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఐడీఎఫ్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఓ క్షిపణిని కూల్చగా, కొన్నింటిని వదిలేసినట్లు చెప్పింది.