హైదరాబాద్ : ఇరాన్పై(Iran) అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా(West asia) నెత్తురోడుతోంది. వందలాది మంది అమాయకులు బలవుతున్నారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei) మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధ్రృవీకరించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించనట్లు వివరాలను వెల్లడించింది. ఖమేనీ మృతి 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. కాగా, పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగాయి. దీంతో టెహ్రాన్ అంతటా పేలుడు శబ్దాలు వినిపించాయి.
దట్టమైన పొగ వ్యాపించింది. దక్షిణ ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా దాడుల్లో 200 మంది మృతిచెందినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, ఆ దేశ రక్షణ మంత్రి అమీర్ మరణించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తమ సైనిక చర్యను ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’గా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడులను ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’గా ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది.