న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ అమెరికాను మహా సైతానుగా అభివర్ణిస్తూ గురువారం విమర్శలు గుప్పించారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యంపై రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టంచేశారు. ఖమేనీ పంపిన లిఖితపూర్వక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో చదివి వినిపించారు. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక కార్యక్రమాలపై రాజీపడబోమని, అవి జాతీయ సార్వభౌమత్వానికి కేంద్రంగా ఉంటాయని ఖమేనీ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్లకు స్థానం లేదని ఆయన ప్రకటించారు.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్కు చెందిన జలాలవ్యాప్తంగా ఉన్న మేము, మా పొరుగువారు ఒక ఉమ్మడి గమ్యాన్ని పంచుకుంటాము. దురాశ, దురుద్దేశంతో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన విదేశీయులకు సముద్రగర్భంలో తప్ప ఎక్కడా స్థానం లేదు అని ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ సాంకేతిక, సైనిక సామర్థ్యాలు తమ జాతి ఆస్తులుగా ఆయన అభివర్ణించారు. వాటిని తమ ప్రజలే రక్షించుకుంటారని ఆయన చెప్పారు.
ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో పురోగతి కుంటుపడిన నేపథ్యంలో తన శత్రువులు తీవ్రంగా భయపడే ఒక కొత్త ఆయుధాన్ని అతి త్వరలో ఆవిష్కరించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నావికాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ గురువారం మాట్లాడుతూ తమ దేశం అతి త్వరలో తమ శత్రువులను వారి పక్కనే ఉన్న ఆయుధంతో ఎదుర్కొంటుందని, వారికి గుండెపోటు రాదని ఆశిస్తున్నాము అని హెచ్చరించారు.
ఇరుపక్షాల మధ్య తీవ్రమవుతున్న వాగ్వాదాలు, కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ తాజా పరిస్థితుల్లో త్వరిత విజయంపై శత్రువుల అంచనాలను ఇరాన్ సైన్యం కొట్టివేసింది. ఇటువంటి అంచనాలు హాస్యాస్పదంగా మారాయని పేర్కొన్నది. మూడు రోజుల నుండి ఒక వారం లోపు సాధ్యమైనంత తక్కువ సమయంలో ఇరాన్తో యుద్ధాన్ని ముగించవచ్చని శత్రువులు భావించారు. వారి ఈ ఊహ ఒక జోక్గా మారింది అని నేవీ కమాండర్ అన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది.