US vs Iran : అమెరికా, ఇరాన్ (US, Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన ఎంక్యూ-1 డ్రోన్ (MQ-1 drone) ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం ప్రకటించింది. శత్రుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఉద్దేశంతో తమ జలాల్లోకి ప్రవేశించిన డ్రోన్ను వెంటనే గుర్తించి, గగనతల రక్షణ క్షిపణులతో కూల్చివేసినట్లు ఐఆర్జీసీ తన ప్రకటనలో పేర్కొన్నది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇటీవలికాలంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. గత మంగళవారం కూడా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్ను తమ గగనతల రక్షణ విభాగాలు కూల్చివేశాయని ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని అప్పుడే ఇరాన్ హెచ్చరించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన ఒక యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఇరాన్పై తాము ‘ఆత్మరక్షణ దాడులు’ చేసినట్లు అమెరికా ప్రకటించింది.
సోమవారం దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలపై దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్రకామ్) తెలిపింది. తమ దళాలను ఇరాన్ నుంచి వచ్చే ముప్పుల నుంచి కాపాడుకోవడానికే ఈ దాడులు నిర్వహించామని, కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ తమ దళాల రక్షణకు కట్టుబడి ఉన్నామని సెంట్రకామ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా గురువారం రాత్రి కూడా ఇరాన్లోని ఒక సైనిక స్థావరంపై అమెరికా దాడులు నిర్వహించింది.
ఈ స్థావరం అమెరికా దళాలకు, వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించిందని వాషింగ్టన్ పేర్కొన్నది. ఇదిలావుంటే గురువారం తెల్లవారుజామున హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్కు తూర్పున మూడు భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ రిపోర్ట్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం తమకు ముప్పుగా పరిణమించిందని, అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని చూస్తోందనే కారణంతోనే ఇజ్రాయెల్తో కలిసి ఈ పోరాటం చేస్తున్నామని అమెరికా వాదిస్తోంది.