Iran Leadership : ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆ దేశానికి నాయకత్వ సమస్య వేధిస్తుంది. ఇప్పుడు ఇరాన్ను నడిపిస్తున్న వారి మధ్య విబేధాలు కూడా మొదలయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ కోరుతున్నారు. ఇరాన్కు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అబ్బాస్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇరాన్ అధ్యక్షుడు, ఇతర నేతల్ని సంప్రదించడం లేదు. అలాగే, ఇరాన్ సైనిక సంస్థ అయిన ఐఆర్జీసీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ సంస్థతో కలిసి అబ్బాస్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాతో అణు చర్చల అంశంలో కూడా అబ్బాస్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఏ సమాచారాన్ని అధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్, ఇతర నేతలతో పంచుకోవడం లేదు. అంతేకాదు, ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనను మాత్రమే సంప్రదిస్తూ అణు చర్చల అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఇరాన్ అధ్యక్షుడు సహా ఇతరఅగ్రనాయకత్వం అబ్బాస్ అరాగ్చీపై ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే అరాగ్చీని విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించాలని వారంతా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అబ్బాస్ వైఖరి ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఆయనను తొలగించాలని వారు నిర్ణయించారు. అయితే, ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో అంతర్గత విబేధాలు ఇదే మొదటిసారి కాదు. ఖమేనీ మరణం తర్వాత నుంచి పలువురు నేతల మధ్య ఈ విబేధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఐఆర్జీసీ కమాండ్ వాహిదికి, అధ్యక్షుడు పెజెష్కియన్కు మధ్య బేధాభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలు నాయకత్వంలో బేధాభిప్రాయాలకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్యుద్ధం ఇరాన్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.