టెహ్రాన్, ఏప్రిల్ 15 : హొర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ దాని గుండా తమ నౌకలు, ట్యాంకర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హొర్ముజ్పై అమెరికా దిగ్బంధం కొనసాగితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మార్గాల్లో జరిగే వాణిజ్య రవాణాను అడ్డుకుంటామని అమెరికాను టెహ్రాన్ హెచ్చరించింది. ఈ మేరకు టెహ్రాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ అలీ అబ్దొల్లాహి మాట్లాడుతూ తమ నౌకలు, ట్యాంకర్లను అమెరికా అడ్డుకోవడం కాల్పుల విరమణ ఉల్లంఘనకు నాందిగా భావిస్తామని అన్నారు. ‘శక్తిమంతమైన ఇస్లామిక్ రిపబ్లిక్ సాయుధ దళాలు ఈ మార్గాల గుండా ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు అంగీకరించబోవు’ అని పేర్కొన్నారు. కాగా, ఎర్రసముద్రంపై నౌకలను యెమన్లోని హౌతీ రెబల్స్ సహాయంతో అడ్డుకోవాలని ఇరాన్ యోచిస్తున్నది.
ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంక్షోభం ముగియనుందని పునరుద్ఘాటించారు. ‘ఇది అతి త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. రెండు అద్భుతమైన రోజులకు ప్రపంచం సాక్ష్యం కాగలదని అన్నారు. కాగా, ఒక పక్క యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రకటిస్తున్న ట్రంప్ అదే సమయంలో తమ బలగాలను పశ్చిమాసియాలో మోహరిస్తున్నారు. పెంటగాన్ సుమారు 10 వేల అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తున్నదని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
హొర్ముజ్ జలసంధి శాశ్వతంగా తెరచి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో రహస్య చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరాన్కు ఆయుధాలు పంపడం ఆపడానికి చైనా అధ్యక్షుడు అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో బుధవారం ఒక ప్రకటన చేశారు. ‘మేం కలిసి తెలివిగా, చాలా బాగా పనిచేస్తున్నాం. కొట్టుకోవడం కన్నా ఇది మంచిది కదా? కానీ గుర్తుంచుకోండి. అవసరమైతే మేం కొట్లాడటంలో కూడా చాలా నిష్ణాతులం, అందరికన్నా ఎంతో ఉత్తమంగా’ అని ఆయన ట్రూత్ సోషల్లో వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ నివారణకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో మంత్రులు, ఇతర ప్రతినిధుల బృందం బుధవారం టెహ్రాన్కు చేరుకుంది. వారికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్వాగతం పలికారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో రెండో విడత చర్చలు జరగనున్న క్రమంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
పశ్చిమాసియా యుద్ధం తర్వాత హొర్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానాన్ని సురక్షితం చేయడానికి ఒక విస్తృత కూటమిని ఏర్పాటు చేసేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో జర్మనీ కూడా భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా మైన్లను తొలగించే నౌకలు, ఇతర నౌకలను మోహరించనున్నారని, అయితే ఈ ప్రతిపాదనలో అమెరికాను మినహాయించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. హొర్ముజ్ జలసంధి కోసం ప్రతిపాదించిన యుద్ధానంతర అంతర్జాతీయ రక్షణ మిషన్లో ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లను మినహాయిస్తారు.