టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతిక కాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, నల్లని రంగు దుస్తులు ధరించిన వేలాది మంది సందర్శనకు తరలివచ్చారు. షియా సంప్రదాయం ప్రకారం పురుషులు గుండెలు బాదుకుంటూ విలపించారు. కాగా ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయతొల్లా అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని ఇరాన్లోని వివిధ నగరాలతో పాటు పొరుగు దేశమైన ఇరాక్కు కూడా తరలించనున్నారు. ప్రస్తుత సంతాప దినాల నేపధ్యంలో టెహ్రాన్లోని వాయుమార్గం, రహదారులను అధికారులు మూసివేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన జూలై 4వ తేదీనే ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలను ప్రారంభించడం గమనార్హం. కాగా ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, ‘మనం ఇరాన్ను దారుణంగా ఓడించాం. యుద్ధం కారణంగా ఇరాన్ దారుణంగా నష్టపోయింది. మనం చాలా మంచివాళ్లం కాబట్టి ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్కు వీకాఫ్ ఇచ్చాం’ అని వ్యాఖ్యానించారు. ఖమేనీ శవపేటిక పక్కనే ఆయన 14 నెలల మనవరాలు జహ్రా శవ పేటికను, ఆ పక్కనే ఆ చిన్నారి ఫొటో ఫ్రేమ్ను ఉంచారు.