Iran Attacks : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రంగా మారుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి శనివారం ఉదయం దాడులు చేయగా.. మధ్యాహ్నం నుంచి ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. వరుస మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. అమెరికా సైనిక స్తావరాలున్న యూఏఈలోని అబుదాబి, ఖతార్లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్పై మిస్సైల్స్ ప్రయోగించింది.
దీంతో మధ్యప్రాచ్య దేశాలు కూడా యుద్ధ వాతావరణంలోకి వచ్చేశాయి. తాము పేలుళ్ల శబ్దాలు విన్నామని అబుదాబి ప్రజలు చెప్పారు. ఈ ప్రాంతాలన్నీ అమెరికా సైన్యానికి, నౌకాదళానికి ఆశ్రయమిచ్చినవే. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగింది. అబుదాబిలో యూఏఈ ఎయిర్ఫోర్స్, యూఎస్ ఎయిర్ఫోర్స్ కలిసి అల్ ధఫ్రా ఎయిర్ బేస్ను పంచుకుంటాయి. దుబాయిలోని జబేయ్ అలీ పోర్ట్ను యూఎస్ నేవీ వాడుకుంటుంది. ఇక్కడ అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు దిగుతుంటాయి. దోహాలో అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్ను యూఎస్ సెంట్రల్ కమాండ్ వాడుకుంటుంది. సౌదీ అరేబియాలో 2,000 మందికిపైగా అమెరికన్ సైనికులున్నారు. ఇక్కడి బేస్ అమెరికా సైన్యానికి కీలక స్థావరంగా ఉంది. మిస్సైల్స్, ఇతర ఆర్మీ స్థావరాలు వంటివి ఇక్కడున్నాయి.
బహ్రెయిన్లోని మనామా హెడ్ క్వార్టర్స్లోని అమెరికాకు చెందిన ఐదో నావికా స్థావరంపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. ఈ మిస్సైల్స్ను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. మిగతా వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదని ఖతార్, సౌదీ ప్రకటించాయి. యుద్ధం నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్లలో ఎయిర్ స్పేస్ను ప్రస్తుతానికి మూసివేశారు.