Iran Supreme Leader : ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినప్పటి నుంచి కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక కోసం ఇరాన్లోని అతిపెద్ద పాలక వ్యవస్థ అయిన అసెంబ్లీ సమావేశమైంది. మత గురువులు ఈ అసెంబ్లీలో నిపుణులుగా ఉంటారు.
మొత్తం 88 మందికి సభ్యత్వం ఉంటుంది. వీరంతా కలిసి ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. కారణం.. కొన్ని నిబంధనలే. అన్ని నిబంధనలు, మార్గదర్శకాల్ని అనుసరించి మాత్రమే కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం 88 మంది సభ్యులు వ్యక్తిగతంగా అసెంబ్లీకి రావాలి. కానీ, ప్రస్తుత పరిస్తితుల్లో ఇది సాధ్యం కాదని కొందరు మత గురువులు అంటున్నారు. భద్రతా కారణాల రీత్యా అందరూ ఒకేచోటుకు రావడం వీలుకాదని, దీనివల్ల శతృవులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కొందరి వాదన. ఈ విషయంలో వారిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసం కొత్త నేతను ఎన్నుకున్నప్పటికీ పేరును మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు.
అయితే, తన తర్వాత కొత్త నేతను నాయకుడిగా ఎన్నుకోవాలంటే అతడిని ఇరాన్ శతృవులు అతిగా ద్వేషించేవాడై ఉండాలని ఖమేనీ చెప్పినట్లు అయతొల్ల మోహ్సేన్ హైదరి అన్నాడు. అమెరికా కూడా అతడి పేరు చెప్పి ఉండాలని సూచించినట్లు వెల్లడించాడు. అందువల్ల అలాంటి నేతనే ఎన్నుకుంటామని తెలిపాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అయతొల్లా ఖమేనీ కొడుకు మొజ్తాబా ఖమేనీనే సుప్రీం లీడర్గా ఎన్నుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే, అతడి ఎంపికను తాను వ్యతిరేకిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు.