టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరువటంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతుల ప్రకారం, హొర్ముజ్లో రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా తెలిపింది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్ని రెండు వారాల్లోగా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. హొర్ముజ్ జలసంధిలో యుద్ధం ముందునాటి పరిస్థితుల ఏర్పడాలంటే చాలా కాలం పడుతుందని పేర్కొన్నది.
ఇరాన్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. షరతులతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు. ‘హొర్ముజ్ జలసంధి నుంచి రోజుకు 15 నౌకలు మించి అనుమతించం. ప్రతి ప్రయాణానికీ ఇరాన్ ఆమోదం, నిర్దిష్ట నియమావళిని పాటించటం తప్పనిసరి’ అని అన్నారు. ఐఆర్జీసీ పర్యవేక్షణలో పనిచేసే ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని ప్రాంతీయ పక్షాలకు అధికారికంగా తెలియజేశారు.