యాపిల్ కొత్త ఐఫోన్లో ఉన్న ‘క్రాష్ డిటెక్షన్’ ఫీచర్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తోంది. ఈ మొబైల్ యూజర్లు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీసులను హెచ్చరిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ను యాపిల్ కంపెనీ తీసుకొచ్చింది. కానీ ఇటీవల తెలిసిన వివరాల ప్రకారం, అమ్యూజ్మెంట్ పార్కుల్లో రోలర్ కోస్టర్ రైడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ ఫీచర్ ఆన్ అయిపోతోందట.
తాజాగా 39 ఏళ్ల సారా వైట్ అనే మహిళ కుటుంబంతో కలిసి ఒక అమ్యూజ్మెంట్ పార్కుకు వెళ్లింది. అక్కడ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కింది. ఆ సమయంలో ఆమె ప్రమాదం బారిన పడినట్లు భావించిన మొబైల్ ఫీచర్ ఆన్ అయిపోయింది. పోలీసులకు వెంటనే కాల్ వెళ్లింది.
‘ఈ ఐఫోన్ వాడుతున్న వ్యక్తికి భయంకరమైన ప్రమాదం జరిగింది. వాళ్లు తన మొబైల్కు రెస్పాండ్ అవడం లేదు’ అనే మెసేజ్ ఏడు సార్లు వినిపించింది. దీంతో పోలీసులు ఒక బృందాన్ని సదరు అమ్యూజ్మెంట్ పార్కుకు పంపించారు. అయితే రైడ్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం గ్రహించిన సారా.. పోలీసులకు ఫోన్ చేసి తను బాగానే ఉన్నట్లు తెలియజేసింది.
ఇది ఒక్కటే కాదని, ఇలా యూజర్లు అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఉండగా కనీసం ఆరుసార్లు తమకు యాక్సిడెంట్ అయినట్లు ఐఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ కాల్ అందుకొని ఘటనా స్థలానికి వెళ్లిన బృందాలు అమ్యూజ్మెంట్ పార్కుల్లో సదరు వ్యక్తులను కలిసి తిరిగొచ్చారని తెలియజేశారు. దీనిపై స్పందించిన యాపిల్ కంపెనీ.. ఈ టెక్నాలజీ చాలా కచ్చితత్వంతో పనిచేస్తుందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపింది.