జకర్తా: ఇండోనేషియాలో గత సోమవారం సంభవించిన భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 310కి చేరిందని ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. పశ్చిమ జావాలోని సియాంజుర్ ప్రాంతంలో గత సోమవారం మధ్యాహ్నం 1.21 గంటలకు 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
ఈ ఘటనలో 200 మందికిపైగా మరణించారు. 2000 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. మొత్తం 56,320 ఇండ్లు ధ్వంసమయ్యాయి. 31 పాఠశాలలు, 124 ప్రార్థనా స్థలాలు, మూడు ఆస్పత్రులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 62 వేల మంది ఆవాసాలు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయుల కోసం ఆ ప్రాంతంలో 14 శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేశారు.
గత ఐదు రోజులుగా భూకంప ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో మృతుల సంఖ్య 310కి చేరింది. ఇప్పటికీ ఇంకా 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.