వాషింగ్టన్, జనవరి 23: అమెరికాలో ఉద్యోగం.. డాలర్లకు డాలర్లు సంపాదన.. భవిష్యత్తుకు, కుటుంబానికి, పిల్లల చదువులకు ఢోకా లేదన్న సంతోషం. ఇవన్నీ ఆలోచించుకొంటూ హాయిగా నిద్రపోయారు. తెల్లారితే కానీ అర్థం కాలేదు.. ఒక్క రాత్రిలో కలలన్నీ తలకిందులయ్యాయని! ఒకే ఒక్క మెయిల్. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. ‘మీ సేవలు మాకిక చాలు. రెండు, మూడు నెలల జీతం ఇస్తాం. మిమ్మల్ని జాబ్లోంచి తీసేసినందుకు క్షమించాలి’ అని ఆ మెయిల్ సం దేశం. ఒక్కరికో, ఇద్దరికో కాదు.. లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే. ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర బడాబడా కంపెనీలన్నీ లేఆఫ్ పేరుతో ఉద్యోగంలోంచి చెప్పాపెట్టకుండా పీకేస్తున్నాయి. దీంతో గంపెడాశలతో, ఎన్నో కలలతో అమెరికా చేరిన ఉద్యోగులకు పీడకలలు మిగులుతున్నాయి.
మరీ ముఖ్యంగా భారతీయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం దాదాపు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. అందులో 30-40 శాతం మంది భారతీయులేనని పరిశ్రమల వర్గాల సమాచారం. ఇందులో హెచ్1బీ, ఎల్1 వీసా హోల్డర్లే ఎక్కువ. అయితే, ఉద్యోగాలు పోవటంతో ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సిందే.
అమెరికా వెళ్లి 3 నెలలు కూడా కాకముందే..
అమెజాన్లో ఉద్యోగం చేస్తున్న గీత (పేరు మార్చాం) మంచి ఉద్యోగం కదా! అని మూడు నెలల కిందటే అమెరికాకు వచ్చారు. భవిష్యత్తు బాగుంటుందని కలగన్నది. కానీ, ‘అమెజాన్లో మార్చి 20 మీ చివరి పని దినం’ అని మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు. హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లిన సీత (పేరు మార్చాం)ది కూడా అదే పరిస్థితి. పైగా ఆమె సింగిల్ మదర్. ఒక కొడుకు ఉన్నాడు. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తున్న ఆమెకు.. జనవరి 18నే చివరి పనిదినం. అబ్బాయి చదువు కొనసాగేదెలా? ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదు అని ఆమె అంటున్నారు.
సహాయకేంద్రాలు ఏర్పాటు
ఐటీ ప్రొఫెషనల్స్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. వీలైనంత వరకు కొత్త ఉద్యోగంలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్ఐఐడీఎస్కు చెందిన ఖండే రావు ఖండ్ తెలిపారు.
పిల్లల చదువులే బెంగ
అమెరికాలో ఉద్యోగం కాకపోతే దేశానికి తిరిగి వచ్చి, ఉన్న సంపాదనతో బతుకుదాం అనుకొన్న ఉద్యోగులూ ఉన్నారు. కానీ, అక్కడ పిల్లలను బడిలో చేర్పించినవాళ్ల పరిస్థితే అయోమయంగా ఉన్నది. వాళ్లను అక్కడ బడి మాన్పిస్తే, విద్యా సంవత్సరం పోతుంది. ఇక్కడి స్కూళ్లలో చేర్పిద్దామంటే సిలబస్లో భారీ వ్యత్యాసాలుంటాయి. ఇక్కడి స్కూళ్లలో పరిస్థితులకు అలవాటు పడటం అతి పెద్ద సమస్య. ఈ పరిస్థితులను వేల మంది భారతీయ టెకీలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.
స్పోటిఫైలోనూ ఉద్యోగాల కోత
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.