తిరుమల : సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు (Mauritius President ) ధరమ్ బీర్ గోకుల్ ( Dharam Bir Gokul) పేర్కొన్నారు . తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి , వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ అతిథులను గౌరవించడంలో, స్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని చెప్పారు. తాను అధ్యాపక వృత్తి నుంచి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. అనంతరం వేద పండితులు మారిషస్ దేశాధ్యక్షుడికి వేదాశీర్వచనం అందించి సన్మానించారు.