Israel | టెల్ అవీవ్, ఏప్రిల్ 3: గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా జీ2జీ విధానంలో ఇజ్రాయెల్ దేశం నుంచి నేరుగా భారత్కు పలుమార్లు వచ్చిన ఆ దేశ ప్రతినిధులు మన ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసి ఇక్కడి వారికి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఇలా ఎంపిక చేసిన భవన నిర్మాణ రంగ కార్మికులు, నిపుణుల మొదటి బ్యాచ్ మంగళవారం ఇజ్రాయెల్కు చేరుకుంది. హమాస్తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇజ్రాయెల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా భారత్, శ్రీలంక తదితర దేశాల నుంచి 20 వేల మంది విదేశీ కార్మికులను ఎంపిక చేసినా యుద్ధం పరిస్థితులతో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి వెళ్లారు.