కైరో: సుయెజ్ కాలువలో చిక్కుకున్న భారీ సరుకు ఓడను .. శనివారం నాటికి పక్కకు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఆ నౌకకు చెందిన జపనీస్ ఓనర్లు ఈ విషయాన్ని తెలిపారు. మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువలో.. ఎవర్ గివన్ సరుకు ఓడ అడ్డంగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దీని వల్ల వేల కోట్ల వాణిజ్యం నిలిచిపోయింది. జలసంధిలో ఇరుక్కున్న ఆ నౌకను మళ్లీ కదలించేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నౌక చిక్కుకున్న తీరం వద్ద వేగంగా తొవ్వకాలు జరిపేందుకు పది టగ్బోట్లను మోహరించినట్లు జపాన్ ఓనర్ యొకిటో హిగాకి తెలిపారు. కాలువలో పడవ చిక్కుకున్న ప్రదేశంలో నీటి కొంద కూడా ఉసికను తొలగిస్తున్నట్లు చెప్పారు. అమెరికాకు చెందిన నేవీ నిపుణులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఆ ఓడను మళ్లీ నీటిపై తేలే విధంగా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఎవర్ గివన్ నౌక చిక్కుకుపోవడం వల్ల అనేక కంపెనీలు తమ నౌకలను ఆఫ్రికా చుట్టుతూ తీసుకువెళ్తున్నాయి. సుయెజ్ రూటు బ్లాక్ కావడం వల్ల ఎర్ర సముద్రంలో సుమారు 200 భారీ షిప్లు జామయ్యాయి. శనివారం సాయంత్రం వరకు సుయెజ్ కాలువ రూటు క్లియర్ అవుతుందని జపాన్ అధికారి తెలిపారు. అయితే నౌకను నీటిపై మళ్లీ తోలేందుకు చేసిన ప్రయత్నం విఫలమైనట్లు ఆ షిప్ టెక్నికల్ మేనేజర్ బెర్నార్డ్ తెలిపారు. గంటలకు 2 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొవ్వే భారీ డ్రెడ్జింగ్ మెషీన్ను తెప్పించినట్లు అధికారులు చెప్పారు. సుయెజ్లో నౌక చిక్కుకోవడం వల్ల .. ప్రపంచ వ్యాప్తంగా ఓడ ప్రయాణాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. 400 మీటర్ల పొడుగు, రెండు లక్షల టన్నుల బరువున్న ఎవర్ గివన్ నౌక సుయెజ్ కాలువలో మంగళవారం అడ్డంగా ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే.