టెహ్రాన్: భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని సూచించాయి.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే టెల్అవీవ్ భారత రాయబార కార్యాలయం అధికారులను +972-54-7520711 ఫోన్ నంబర్లో లేదా cons1. telaviv @mea.gov.in ఈమెయిల్ ఐడీలో సంప్రదించాలని తెలిపాయి. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటం వల్ల అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అబుదాబి, యూఏఈ, సౌదీ, జోర్డాన్ తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడ ఉన్న భారతీయులకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశాయి. మరోవైపు సంయమనం పాటిస్తూ దౌత్యపరమైన చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ ఇరాన్, ఇజ్రాయెల్కు సూచించింది.
ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను ఈజిప్ట్ లేదా జోర్డాన్ మీదుగా తరలించే అవకాశముందని ఇజ్రాయెల్లో భారత రాయబారి జేపీ సింగ్ మీడియాకు తెలిపారు. సమయం రాగానే సంబంధిత ప్లాన్ వెంటనే అమలుజేస్తామని అన్నారు. రోడ్డు మార్గంలో భారతీయుల తరలింపునకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పారు. స్థానిక అధికార యంత్రాంగం సూచనలు పాటించాల్సిందిగా భారత పౌరులకు ఇజ్రాయెల్లోని ఎంబసీ సూచించింది.