Indian : మసాజ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారతీయ సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ శిక్ష విధించింది. 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. నిందితుడు సుమిత్ సతీష్ రస్తోగి (39) మహిళల్ని వేధించినట్లు కోర్టు గుర్తించడంతో అతడికి ఈ శిక్ష వేసింది. ఒక అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన సుమిత్ 2011లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ అడిలైడ్ సిటీలోని గ్లెన్లెగ్లో ఒక మసాజ్ పార్లర్ నడుపుతున్నాడు.
ఈ క్రమంలో 2021, అక్టోబర్ నుంచి 2022 జూలై వరకు.. అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మసాజ్ చేయించుకుంటున్న వారిని అసభ్యంగా వీడియోలు తీయడం, అసభ్యంగా తాకడం వంటి 97 నేరాలకు పాల్పడ్డారు. ఇతడి వేధింపులకు గురైన బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమిత్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని జూలై, 2022లో అరెస్టు చేశారు. ఇంతకాలం ఈ కేసు విచారణ కొనసాగింది. విచారణలో అతడు నేరం చేసినట్లు రుజువైంది. సుమిత్ వేధింపులకు గురైన మహిళలు తీవ్ర మనో వేధనకు గురైనట్లు కోర్టు గుర్తించింది.
అతడి నేరాలకుగాను కోర్టు 13 సంవత్సరాల 10 నెలలపాటు జైలు శిక్ష విధించింది. ఇందులో పదేళ్ల, పది నెలలపాటు పెరోల్ పొందడానికి కూడా వీలు లేకుండా కోర్టు తీర్పునిచ్చింది. అంటే, 2035 వరకు అతడికి పెరోల్ లభించదు. ఇప్పటికే కొంతకాలం నుంచి అతడు జైలులో ఉన్నందున ఆ కాలాన్ని కూడా శిక్షగా పరిగణిస్తారు. ఈ జైలు శిక్ష కాలాన్ని పరిగణనలోకి తీసుకుని 2035లోనే పెరోల్ లభిస్తుంది. ఇక, సుమిత్ తన పూర్తి శిక్ష అనుభవించిన అనంతరం అతడిని ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇండియా పంపేయాలని కూడా కోర్టు ఆదేశించింది.