Indian Jawan | భారత్కు చెందిన ఓ ఆర్మీ జవాన్ అనుకోకుండా పాకిస్తాన్ చేరాడు. గురువారం ఉదయం 6.30 గంటలకు భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పొరపాటున జీరో లైన్ దాటి పాకిస్తాన్లోకి వెళ్లాడు. తమ దేశంలోకి వచ్చిన జావన్ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆ జవాన్ పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఈ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని అబోహర్ ప్రాంతంలో జరిగింది.
గల్లంతైన జవాన్ బీఎస్ఎఫ్ 66 బెటాలియన్కు చెందినవాడు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాపలాగా ఉన్న సదరు జవాన్.. పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్ రేంజ్ సీనియర్ అధికారులను సంప్రదించారు. బీఎస్ఎఫ్ జవాన్ తమ అదుపులోనే ఉన్నట్లు పాక్ అధికారులు ధృవీకరించారు. దాంతో పాక్ రేంజర్లతో బీఎస్ఎఫ్ అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి జవాన్ను విడుదల చేయాలని కోరారు. తొలుత విముఖత వ్యక్తం చేసిన పాక్ రేంజర్లు ఆ తర్వాత విడుదల చేసేందుకు అంగీకరించారు.
సరిహద్దులో గస్తీకి వెళ్లిన జవాన్లు ఉదయం 9.30 గంటలకు తిరిగి వచ్చిన తర్వాత హాజరు తీసుకున్న సమయంలో జవాన్ మిస్ అయినట్లు గుర్తించారు. హడావుడిగా ఆ ప్రాంతమంతా ఆర్మీ జవాన్లు సోదాలు చేపట్టారు. ఆ తర్వాత పాకిస్తానీ రేంజర్లు సంప్రదించగా.. తమ అదుపులోనే ఉన్నట్లు నిర్ధారించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి తమ భూభాగంలోకి చేరుకున్నందున అరెస్టు చేసినట్లు పాక్ రేంజర్లు తెపడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.