India Warning | రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను విడిచిపెట్టి పోవాలని ఇండియన్ ఎంబసీ భారతీయులకు సూచించింది.
ఉక్రెయిన్లో రష్యా దాడులు మరోసారి తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వాధీన పర్చుకున్న ఉక్రెయిన్లోని నాలుగు నగరాల్లో మార్షల్ లా అమలు చేస్తామని రష్యా హెచ్చరించింది. గురువారం నుంచి మార్షల్ లా అమలుచేస్తామని ప్రకటించింది. దాంతో ఖేర్సన్లో పలువురు పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియన్ రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు కీవ్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ట్విట్టర్లోని తమ అధికారిక హ్యాండిల్ ద్వారా సూచన చేసింది.
ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులతో పాటు ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన చాలా మంది భారతీయులు ఇంకా అక్కడే ఉంటున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం సమసిపోతుందని భావించిన చాలా మంది ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఉక్రెయిన్లోనే ఉన్నారు. అయితే, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో అక్కడ ఉండిపోయిన భారతీయులను ఉద్దేశించి తాజాగా ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ఈ ప్రకటన చేసింది.