రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్లోని పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, రోజు రోజుకీ పెరుగుతున్న బాంబు దాడుల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. తరువాత పరిస్థితులనే బట్టి, మరిన్ని నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
రష్యా- ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులు, దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాతే ఉక్రెయిన్ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్కు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.