India–US : ఇండియా–అమెరికా మధ్య అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాపై కీలక ఒప్పందం కుదిరింది. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ సప్లైలపై వ్యూహాత్మక ముందడుగు పడింది. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఒక ఫ్రేమ్వర్క్ కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇండియాలోనే ఉన్నారు. మార్కో రుబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు.
తాజాగా క్రిటికల్ మినరల్స్పై ఒక ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల చైనాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. ఎందుకంటే క్రిటికల్ మినరల్స్ సరఫరాలో ప్రపంచం ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా, ఇండియా ఒకదానికి ఒకటి సహకరించుకుంటే పరస్పరం లబ్ధి పొందవచ్చు. దీనివల్ల ఆధునిక సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, రక్షణరంగ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకు కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఒప్పందం ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, పెట్టుబడులు, రీసైక్లింగ్ వంటి వాటిలో ఇరు దేశాలు కలిసి పని చేస్తాయి. సాంకేతికతను పంచుకుంటాయి.
భూమిలో అరుదుగా లభించే ఖనిజాలు, ఇతర ముడి పదార్థాలను క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఈ ముడి సరుకు ద్వారానే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వాడే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, టెలీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఫైటర్ జెట్లు, ఏఐ నిర్మాణ సామగ్రి వంటివి తయారు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ చాలా ముఖ్యం. వీటి లభ్యతలో చైనా ముందుంది. ఈ మార్కెట్లో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా–అమెరికా పరస్పరం సహకరించుకోవడం అవసరం.