లండన్, మే 13: భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం సహా ఇతర కళాఖండాలను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ దౌత్య ప్రచారాన్ని ప్రారంభించిందని యూకేకు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. దీని ప్రకారం… ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని అధికారులు భారత్ నుంచి బ్రిటన్ తరలించిన కళాఖండాల లెక్కలు తీసే పనిలో ఉన్నారు.
బ్రిటన్ రాజు కిరీటంలోకి చేరిన కోహినూర్ వజ్రాన్ని సైతం తిరిగి పొందేందుకు దౌత్యపరంగా ప్రయత్నించనున్నారు. ఇరు దేశాల మధ్య జరిగే దౌత్య చర్చల్లో ఈ అంశం కూడా చర్చకు రానున్నది. ఇప్పటికే దక్షిణ భారత్లోని ఓ ఆలయం నుంచి తీసుకెళ్లిన ఓ కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్కు చెందిన అష్మోలియన్ మ్యూజియంను భారత అధికారులు సంప్రదించారు.