Bangladesh : బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే, బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయం సాధించడంలో ఇండియాతోపాటు, మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్ర ఉందని నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) అధినేత నహీద్ ఇస్లాం ఆరోపించాడు. నహీద్ గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.
ఆమెను పదవినుంచి దించడంలో పోరాటం చేశాడు. ఆ ఇమేజ్తోనే 2025 ఫిబ్రవరిలో ఎన్సీపీని స్థాపించాడు. ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో జమాతే ఇస్లామి పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేశారు. 297 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 212 సీట్లతో అధికారం దక్కించుకుంది. జమాతే 68 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ ఆరు సీట్లకే పరిమితమైంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ను ఈ ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించారు. ఈ ఎన్నికల తర్వాత నహీద్ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతిపక్ష విప్గా కూడా ఎన్నికయ్యాడు. ఇక ఈ ఎన్నికల్లో తన పార్టీతోపాటు జమాతే ఓడిపోవడంపై స్పందించాడు. నహీద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ తాజా ఆరోపణలు చేశాడు. ఇండియాతోపాటు, షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ సహకారంతోనే బీఎన్పీ గెలిచిందన్నాడు.
ఎన్నికల ఫలితాల్ని ఇండియా ప్రభావితం చేసిందని ఆరోపించాడు. ఇండియా, అవామీ లీగ్, బీఎన్పీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకే తాజా ఫలితాలు వెలువడ్డాయన్నాడు. అవామీ లీగ్ ఆఫీసుల్ని ఇటీవల బీఎన్పీ నేతలు ప్రారంభించడమే ఇందుకు నిదర్శనమన్నాడు. ఎన్నికల్లో మోసాలకు పాల్పడటం, ఎలక్షన్ ఇంజినీరింగ్ వల్లే బీఎన్పీ గెలిచిందని ఆరోపించాడు. తారిఖ్ రహమాన్ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అవామీ లీగ్ పార్టీ యాక్టివ్గా మారింది. దీంతో బీఎన్పీ, అవామీ లీగ్ మధ్య ఒప్పందం ఉందనే వాదన ఊపందుకుంది.