Ebola outbreak : ఆఫ్రికా దేశాల్లో ఎబోలా భారీగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకు కీలక సూచన చేసింది. అత్యవసరమైతే తప్ప రిపబ్లిక్ ఆఫ్ద కాంగో (డీఆర్సీ), ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు వెళ్లకూడదని సూచించింది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది.
పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటూ ఆఫ్రికాలో ఎబోలా విజృంభణ గురించి ప్రకటించింది. ఎబోలా వ్యాప్తిపై అంతర్జాతీయ అప్రమత్తత అవసరం అని పేర్కొంది. అంతేకాదు.. ద ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఎబోలా వ్యాప్తిపై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం డీఆర్సీ, ఉగాండాలలో బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాపిస్తోంది. ఈ వైరస్ చాలా త్వరగా, సులభంగా వ్యాపిస్తుంది. ఇది రక్తం, వాంతులు, వీర్యం, చెమట, శరీరం నుంచి కారే ద్రవాలు వంటి వాటి వల్ల ఎబోలా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. జ్వరం, బలహీనత, కండరాల నొప్పులు, డయేరియాతోపాటు కొన్నిసార్లు రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇండియాలో కూడా ఈ విషయమై కేంద్రం అప్రమత్తంగా ఉంది. విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల్ని పర్యవేక్షిస్తున్నారు.