SCO Summit | అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నెలల్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ జస్టిస్ భారత్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ ( ఎస్సీఓ) సమ్మిట్కు హాజరుకావాల్సిందిగా భారత్ వారికి ఆహ్వానాలు పంపింది. అయితే, వారి నుంచి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఎస్సీఓలో భారత్తోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ – 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో భారతదేశం ఎస్సీఓ రొటేటింగ్ ప్రెసిడెన్సీని పొందింది. దాంతో ఈ ఏడాది మన దేశంలో షాంఘై సమ్మిట్ జరుపుతుంది. ఈ ఏడాది మార్చి, మే నెలలో షాంఘై సమ్మిట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సమ్మిట్ను విజయవంతం చేసేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, చీఫ్ జస్టిస్ ఉమర్ ఆటా బండియాలకు భారత్ ఆహ్వానం పంపింది. అయితే, భారత్ ఆహ్వానాన్ని పాకిస్తాన్ ఇంకా అంగీకరించలేదని తెలుస్తున్నది. మార్చి నెలలో ఎస్సీఓ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, మే నెలలో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. విదేశాంగ మంత్రుల సమావేశాన్ని గోవాలో జరిపేందుకు ఇప్పటికే భారత్ నిర్ణయించింది.
భారత్ ఆహ్వానాన్ని పాకిస్తాన్ ఆమోదిస్తే.. చాలా ఏండ్ల తర్వాత పాకిస్తాన్లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. భారతదేశం పంపిన ఆహ్వానాన్ని పాకిస్తాన్ అధికారులు కూడా ద్రువీకరించారు. అయితే, ఈ సమ్మిట్కు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి, విదేశాంగ మంత్రి స్వయంగా హాజరవకుండా తమ ప్రతినిధిని పంపవచ్చునని తెలుస్తున్నది. కాగా, సర్జికల్ స్ట్రైక్స్ కారణంగా 2016 లో పాకిస్తాన్ మాజీ చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.