India vs Pakistan : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ (Pakistan) కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో భారత్ (India) పై నిందలు మోపేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. అయితే భారత్ ఆ ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సాయుధ ఘర్షణల్లో పౌరులకు రక్షణ కల్పించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో గురువారం బహిరంగ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించారు.
పాకిస్థాన్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా తిప్పికొట్టారు. నరమేధ చర్యలకు పాల్పడే దేశం.. భారత అంతర్గత విషయాల గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన దాడుల గురించి హరీష్ ప్రస్తావించారు. పవిత్ర రంజాన్ మాసంలో కాబుల్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిని ప్రపంచం ఇంకా మరిచిపోలేదన్నారు. ఈ అమానుషమైన హింసాకాండలో 269 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 122 మంది గాయపడినట్లు తెలిపారు.
చీకట్లో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాకిస్థాన్ కపటత్వానికి నిదర్శనమని విమర్శించారు. తన సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ.. జాతి నిర్మూలనకు పాల్పడే దేశం ఇలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడటంలో పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదని అన్నారు.