మాస్కో: రష్యా నుంచి ఇంధనాన్ని కోనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కౌంట్ రేటుకే ఇంధనాన్ని అమ్మేందుకు రష్యా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే రష్యా మన దేశానికి కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్ను భారత్ పాజిటివ్గా తీసుకున్నట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి. క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి ఖరీదు చేసేందుకు భారత్ యోచిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. చమురుతో పాటు ఇతర కొన్ని వస్తువుల్ని కూడా డిస్కౌంట్లో రష్యా అమ్మాలనుకుంటోంది.
పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో పాటు స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ వ్యవస్థను కూడా స్తంభింపచేశాయి. ఈ నేపథ్యంలో భారత్తో వాణిజ్యానికి జరిపేందుకు రష్యా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా దాదాపు 80 శాతం ఆయిల్ను విదేశాల నుంచి తెప్పించుకుంటోంది. దాంట్లో రెండు లేదా మూడు శాతం ఇంధనం రష్యా నుంచి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధర పెరుగుతున్న నేపథ్యంలో.. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకే ఆయిల్ను దిగుమతి చేసేందుకు ఇండియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ కొంటే అప్పుడు ఇండియాకు ఎటువంటి సమస్య లేదని తెలిస్తేనే ఈ దిశగా అడుగులు ముందుకు పడనున్నాయి. రూపాయి, రుబుల్ మధ్య వాణిజ్య బంధాన్ని పెంచేందుకు రష్యా అధికారులు చూస్తున్నారు. ఒకవేళ ఇండియా ఓకే అంటే అప్పుడు రష్యా నుంచి మనకు చౌకకే చమురు లభించనున్నది.