చైనా భారత్ సంబంధాల విషయంలో చైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాలు ప్రత్యర్థులుగా కాకుండా.. భాగస్వాములుగా మారాలని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇరు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే విరోధులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని ఆయన అన్నారు. ఇరు దేశాలు భాగస్వాములుగా ఉంటూ తమ తమ లక్ష్యాలను చేరుకోవాలని పేర్కొన్నారు. సంఘర్షణలు, విరోధం కాకుండా భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్యానించారు.
ఇక ఇరు దేశాల మధ్య వున్న సరిహద్దు వివాదాల విషయంపై కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. ఈ సరిహద్దు వివాదాలు పెద్దవిగా మారి, ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేసే విధంగా ఉండొద్దని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య కొందరు నిప్పులు పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇరు దేశాల మధ్య వున్న సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్యవర్తిత్వానికి మేం రెడీ : వాంగ్యీ
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకరమైన పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి, చర్చల విషయంలో తాము మధ్యవర్తిత్వానికీ సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో గానీ, శాంతియుత వాతావరణం నెలకొనే విషయంలో గానీ.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధమని వాంగ్యీ ప్రకటించారు.