తెహ్రాన్, మార్చి 4: ఒకవైపు హిజాబ్కు వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో.. చదువుకుంటున్న అమ్మాయిలపైన వరుసగా జరుగుతున్న విష ప్రయోగం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 900 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. అమ్మాయిలు విద్యకు దూరం కావాలనే చాందసవాద ఆలోచనలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రెండు నెలలుగా ఇవి జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు.
మొదట కోమ్ అనే నగరంలో గతేడాది నవంబరు 30న ఓ హైస్కూల్లో విషప్రయోగం జరగగా 18 బాలికలు దవాఖాన పాలయ్యారు. ఫిబ్రవరి 14న ఇదే నగరంలో 13 స్కూళ్లలో విషప్రయోగం చేయడంతో 100 మందికి పైగా అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రాజధాని టెహ్రాన్లోనూ ఇలాంటి ఘటనలో 35 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. ఇప్పుడు ఏకకాలంలో ఐదు ప్రావిన్సుల్లోని పాఠశాలల్లో విషప్రయోగం జరిగింది. పదుల సంఖ్యలో అమ్మాయిలు దవాఖానల్లో చేరారు.
విషప్రయోగానికి గురవుతున్న బాలికలు క్రమంగా కోలుకుంటున్నారు. దీం తో బాలికల ప్రాణాలకు ముప్పు కలిగించడం కాకుండా వారిలో భయాన్ని సృ ష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బాలికల పాఠశాలలు మూసివేయాలనే లక్ష్యంతోనే ఈ దాడులు జురుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన కలిగించేందుకు మానసిక యుద్ధంలో భాగంగా శత్రువులు ఈ పని చేస్తున్నారని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసి ఆరోపించారు. విషప్రయోగ ఘటనలపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలల ముందు ఆందోళన చేస్తున్నారు.