Global weather alert | రోమ్: పర్యావరణ మార్పుల విపరిణామాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచదేశాలు హడలిపోతున్నాయి. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, కార్చిచ్చులతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో మరికొన్ని దేశాలు అతలాకుతులం అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతోపాటు పలు యూరప్ దేశాలను భానుడు ఠారెత్తిస్తుండగా, వరుస కార్చిచ్చులతో కెనడా కకావికలం అవుతున్నది. మరోవైపు భారత్, దక్షిణ కొరియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.
అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారాంతంలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. అరిజోనాలో గత పక్షం రోజులుగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారాంతంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని డెత్వ్యాలీలో ఆదివారం నాటికి 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకావొచ్చని పేర్కొన్నది.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా యూరప్ అంతటా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోమ్, ప్లోరెన్స్ సహా 16 నగరాల్లో ఇటలీ రెడ్ అలర్ట్ జారీచేసింది. ఇటలీలో 2007 ఆగస్టులో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలనూ వడగాడ్పులు వణికిస్తున్నాయి. సిసిలీ దీవుల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
కెనడాను కార్చిచ్చులు హడలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు కోటి హెక్టార్ల విస్తీర్ణం కార్చిచ్చులకు ఆహుతైంది. ఇది పోర్చుగల్, ఐస్ల్యాండ్ దేశాల భూభాగంతో సమానం. కార్చిచ్చుల కారణంగా 1,50,000 మంది నిరాశ్రయులయ్యారు.
ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా నీట మునిగింది. హిమాచల్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఉత్తరభారతంలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణకొరియా అతలాకుతలం అవుతున్నది. ఆకస్మిక వరదల కారణంగా ఆ దేశంలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆసియా దేశమైన జపాన్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.