న్యూఢిల్లీ : భారత్ వంటకాలంటే పడిచచ్చే బ్రిటన్ వ్యక్తి జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ చూస్తే అన్నీ మన వంటకాలే కనిపిస్తాయి. తాజాగా జాక్ మిర్చి వడ ట్రై చేయగా హాట్ రెసిపీకి దేశీ నెటిజన్లు ఫిదా అయ్యారు. జాక్ తెలంగాణ, ఏపీ, రాజస్ధాన్, కర్నాటక, గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల డిష్లను తయారుచేసి మన భోజనప్రియులకు ఘుమఘుమలు పంచగా ఇప్పుడు మిర్చి వడ తయారుచేసి నోరూరించారు.
మిర్చి వడ చేస్తున్న జాక్ తాజా వీడియో 90 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. రాజస్ధాన్ ఫుడ్ సిరీస్లో భాగంగా ఆయన మిర్చి వడ చేశారు. ఈ వీడియోలో జాక్ మిర్చిలను కట్ చేసి వాటిలో ఉడకబెట్టిన ఆలూను స్టఫ్ చేసి శనగపిండిలో ముంచి ప్యాన్లో డీప్ ఫ్రై చేయడం కనిపిస్తుంది. ఆపై అవి గోల్డెన్ కలర్లో దోరగా వేగి నోరూరించాయి. మిర్చి వడ. మిరపకాయల్లో ఆలూ మసాలా స్టఫ్ చేసి శనగపిండిలో ముంచి!!! అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
దేశీ నెటిజన్లు ఈ వీడియో చూసి లొట్టలేస్తూ జాక్ కుకింగ్ స్కిల్స్పై ప్రశంసలు గుప్పించారు. ఈ వంటకాలను మీరు చేస్తున్న తీరు బాగుంది..ఎలాంటి స్పూన్లు ఉపయోగించకుండా చేతులను వాడారు. భారత ఆహారం తయారు చేసే విధానం అదే..అయితే ముందుగా మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రధానం అని ఓ యూజర్ రాసుకొచ్చారు.