ఇస్లామాబాద్, మే 24: పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ ఆసిఫ్ బుధవారం తెలిపారు. ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామని ఆయన మీడియాకు చెప్పారు. ఇంత జరిగినా తన పార్టీ వారు చేసిన హింసాకాండను ఖండించడానికి ఇమ్రాన్ ఖాన్ విముఖత చూపడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు.ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం మిలటరీతో రాసుకుపూసుకు తిరిగారని, ఇప్పుడు హఠాత్తుగా తన వైఖరి మార్చుకుని దానిపై విమర్శలు చేస్తున్నారని ఆసిఫ్ మండిపడ్డారు.