మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజును అభిశంసించే తీర్మానానికి (Impeachment Motion) ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) దీని కోసం సంతకాలు సేకరించింది. ఎండీపీకి చెందిన ఎంపీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక మీడియా సంస్థ ది సన్ తెలిపింది. డెమోక్రాట్ల భాగస్వామ్యంతో ఎండీపీ సంతకాలు సేకరించినట్లు వెల్లడించింది. అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతు ఇచ్చినట్లు మాల్దీవుల ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అధాధు పేర్కొంది.
కాగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ప్రభుత్వం ఆమోదం కోసం ఆదివారం మాల్దీవుల పార్లమెంట్ సమావేశంలో కీలక ఓటింగ్ సందర్భంగా బాహాబాహీ జరిగింది. స్పీకర్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్ష సభ్యులు దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ సమావేశం సందర్భంగా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
మరోవైపు అధికార సభ్యులు పార్లమెంటుకు అంతరాయం కలిగించడంపై ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే హోం మంత్రి అలీ ఇహుసన్, రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్ ఆమోదాన్ని నిరాకరించాలని నిర్ణయించింది.